ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా,,,పార్టీకి కూడా రాజీనాామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 07:52 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, మరో ఎమ్మెల్సీ తమ పదవులకు, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి పదవులకు రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవాళ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి తమ రాజీనామా లేఖల్ని అందజేయనున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీకి కూడా గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.


ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వైఎస్సార్‌సీపీలో ఈ రాజీనామాలపర్వం మొదలైంది. ముందుగా గుంటూరు పశ్చిమం మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యలు పార్టీని వీడారు. ఆ తర్వాత మరికొందరు మేయర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇటీవల మాజీ మంత్రి ఆళ్లనాని కూడా అదే బాటలో నడిచారు. నిన్న రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రవిల రాజీనామాలు చేశారు. ఇలా ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీని వీడుతున్నారు.


ఇదిలా ఉంటే.. మరో ఆరుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎనిమిది మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు . దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా వైఎస్సార్‌సీపీని వీడతారనే ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు కూడా పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తెలుగు దేశం పార్టీలోకి రావాలని.. అది కూడా వారి వ్యక్తిత్వాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.


మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి భారీగా ఎంపీలు పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరగడంతో.. ముగ్గురు ఎంపీలు మీడియా ముందుకు వచ్చారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు.. తాము వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉంటామన్నారు. ఆర్ కృష్ణయ్య కూడా తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు. రాజస్యభలో బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com