ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముచ్చుమర్రి కేసులో ,,,50 రోజులైనా దొరకని మృతదేహం.. అధికారుల కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 07:38 PM

ముచ్చుమర్రి బాలిక ఘటన.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపిన ఉదంతమిది. ఎనిమిదేళ్ల ఓ బాలికను ముగ్గురు మైనర్ బాలురు కలిసి అత్యాచారం చేసి హత్య చేసిన వైనం రెండు తెలుగు రాష్ట్రాలనూ ఉలిక్కిపడేలా చేసింది. ఆడుకుంటున్న బాలికను ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారనే వార్త రాష్ట్ర ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికార, ప్రతిపక్షాల మధ్యన పెద్ద వాగ్వాదమే నడిచింది. అయితే ఘటన జరిగి ఇన్నిరోజులు గడుస్తున్నా.. నేటికి ఆ బాలిక ఆచూకి లభించలేదు. ఈ దారుణం జరిగి 50 రోజులు కావొస్తున్నా.. బాలిక మృతదేహం ఇంకా లభించలేదు.


ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ముగ్గురు మైనర్లు.. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో బాలిక మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి పోలీసుల గాలింపు చర్యలు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతోనూ, గజ ఈతగాళ్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గ్రామ సమీపంలో బాలిక మృతదేహం ఆచూకీని కనిపెట్టడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో తెలంగాణ వైపు ఉన్న కృష్ణానదిలో గాలిస్తున్నారు. మరోవైపు గాలింపు చర్యలపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆచూకీని కనిపెట్టే ప్రయత్నాలను అధికారులు నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశ తగ్గుతోందని చెప్తున్నారు. తమకు పరిహారం కంటే న్యాయం జరగడమే ముఖ్యమని చెప్తున్నారు. అధికారులు తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా కనిపెట్టాలని.. దోషులకు శిక్షపడేలా చూడాలని కోరుతున్నారు.


అసలేం జరిగిందీ?


జులై ఏడో తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఆడుకుంటున్న బాలికను 13 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు బాలురు పంప్ హౌస్ వద్దకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అయితే తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణ ప్రారంభమైంది. దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు.. బాలికను తమతో తీసుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి పంప్ హౌస్‌లోకి పడేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. విచారణలో బాలురకు వారి పెద్దలు కూడా సహకరించినట్లు తెలిసింది.


బాలురు పడేసినట్లు చెప్తున్న ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటుగా గజ ఈతగాళ్లు, డ్రోన్ల సాయంతో గాలించినా.. బాలిక ఆచూకీ లభించలేదు. ఘటన జరిగి ఇన్నిరోజులైనా ఆచూకీ కనుగొనలేకపోవటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మైనర్ బాలురు, వారి కుటుంబసభ్యులు తప్పుదోవ పట్టించేలా వాంగ్మూలాలు ఇచ్చారని.. అందుకే ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఆచూకీ కనుగొనడంలో జాప్యం జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు. తాజాగా తెలంగాణ వైపున ఉన్న కృష్ణానదిలోనూ గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com