ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీసీఐ సెక్రటరీ రేసులో మరో బీజేపీ నేత కుమారుడు

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:59 PM

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక ఖరారైపోయిందా? బీసీసీఐ కార్యదర్శిగా జై షా స్థానాన్ని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారుడితో భర్తీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవికి కోసం పోటీ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన బార్‌ క్లేకు మరోసారి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ, అతడు మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


 ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఖరారు..


గ్రెగ్‌ బార్‌ క్లే మరోసారి పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించే కీలక పదవిని చేజిక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. అదీ కాకుండా, బీసీసీఐ కార్యదర్శిగా జై షాకు మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతడు కచ్చితంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆయన బీసీసీఐకి చెందిన ఏ పోస్టులోనూ కనీసం మరో మూడేళ్ల పాటు ఉండకూడదు. దీంతో ఈ గ్యాప్‌లో ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టాలని జై షా భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్‌ను సమర్పించడానికి ఆగస్టు 27 వరకు గడువు ఉంది. కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్‌ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 2020 నవంబర్‌లో మొదటిసారి, 2022లో రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన బార్‌ క్లే.. ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఎవరైనా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావాలంటే బోర్డులోని 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు అవసరం. అయితే జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 15 మంది మద్దతు ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఎన్నిక లాంఛనమే కానుంది.


జై షా వారసుడు ఎవరు?


జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే అతడి వారసుడిగా బీసీసీఐ కార్యదర్శి పోస్టును ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇందు కోసం పోటీలో చాలా మంది ఉన్నప్పటికీ ప్రముఖంగా ఓ పేరు మాత్రం వినిపిస్తోంది. అతడే రోహన్‌ జైట్లీ. దివంగత బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ తనయుడే రోహన్ జైట్లీ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ బాధ్యతల్లో ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్‌ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని ప్రచారం జరుగుతోంది. ఐసీసీ ఛైర్మన్‌ పదవికి జై షా ఎన్నికైతే, రోహన్‌ జైట్లీకి కూడా ప్రమోషన్ వచ్చినట్లే..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com