ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సుల్లో నుంచి దింపి మరీ కాల్పులు..ఉగ్ర ఘాతుకం.. 23 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:56 PM

ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన పాకిస్తాన్.. ఇప్పుడు అదే ఉగ్రవాదానికి కకావికలం అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్ర సంస్థల అధినేతలు, కీలక నేతలు ఒక్కొక్కరుగా హతం అవుతుండగా.. అదే స్థాయిలో ఉగ్రవాద దాడులు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఉగ్రవాదులు, పోలీసులు, భద్రతా సిబ్బంది మాత్రమే కాకుండా.. సామాన్య ప్రజలు కూడా చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా నడిరోడ్డుపైనే మారణహోమానికి తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఈ ఘటనల్లో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది.


పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ముసాఖెన్ జిల్లాలోని రరాషమ్‌లో సోమవారం కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి.. ఆ మార్గంలో వస్తున్న వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని పాక్ జాతీయ మీడియా డాన్‌ వెల్లడించింది. బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాల్లో నుంచి ప్రయాణికులను కిందికి దింపి వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఆ తర్వాత వారిలో కొందర్ని అక్కడికక్కడే కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఆ వాహనాలను కూడా మంటల్లో బూడిద చేశారు.


అయితే పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడి చేసినట్లు డాన్ మీడియా పేర్కొంది. పాక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఉగ్రదాడిని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ముష్కర దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు బలూచిస్తాన్ సీఎం హామీ ఇచ్చారు.


అయితే ఇలాంటి ఘటనలు పాకిస్తాన్‌లో కొత్తేమీ కాదు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలను బలూచిస్తాన్‌లోని కెచ్‌ జిల్లాలో గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. అయితే అవి కొందర్ని లక్ష్యంగా చేసుకుని చేసిన హత్యలేనని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. 2015లో జరిగిన ఘటనలో 20 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com