ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక మహారాజా టీ20 టోర్నీలో అరుదైన ఘటన,,మ్యాచ్ ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్‌లు నిర్వహణ

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 09:45 PM

క్రికెట్‌లో ఏదైన జరగొచ్చు. గెలిచేలా కనిపించిన జట్టు ఓడిపోవచ్చు.. ఓటమి అంచుల వరకు వెళ్లిన జట్టూ గెలవొచ్చు. లేదా రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడొచ్చు. ఒక్క బంతి, ఒక్క షాట్, ఒక్క వికెట్, ఒక్క సిక్స్ ఇలాంటివి.. మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసేస్తాయి. ఇది ఇదివరకే ఎన్నో సార్లు రుజువైంది. అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఫలితాన్ని రాబట్టేందుకు మూడు సూపర్ ఓవర్‌లు ఆడించాల్సి వచ్చింది. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటనగా ఇది నిలిచిపోయింది.


 టోర్నీలో భాగంగా బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ మనీశ్ పాండే 33 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బెంగళూరు బ్లాస్టర్స్ సైతం సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. దీంతో ఫలితాన్ని నిర్వహించేందుకు సూపర్ ఓవర్ ఆడించాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు.


సూపర్‌ ఓవర్‌లో తొలుత బెంగళూరు బ్లాస్టర్స్ బ్యాటింగ్ చేసింది. మొదటి సూపర్ ఓవర్‌లో ఆ జట్టు 10/1 స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత హుబ్లీ టైగర్స్ సైతం 10/0 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. రెండో సూపర్ ఓవర్‌లో హుబ్లీ .. బ్లాస్టర్‌కు 9 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ బెంగళూరు బ్లాస్టర్స్ సైతం సరిగ్గా 8 రన్స్ మాత్రమే చేసింది. దీంతో అనూహ్యంగా మ్యాచ్ మూడో సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.


ఇక మూడో సూపర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ 12/1 పరుగులు చేసింది. దీంతో మళ్లీ ఉత్కంఠ చెలరేగింది. హుబ్లీ టైగర్స్ విజయానికి చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఆ జట్టుకు చెందిన క్రాంతి కుమార్.. ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు సూపర్ ఓవర్‌ల తర్వాత ఫలితం వచ్చింది. ఈ పోరు అసాధారణ మ్యాచ్‌గా చరిత్రకెక్కింది.


కాగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య 2019 వన్డే ప్రపంచకప్‌లో సూపర్ ఓవర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ రూల్‌పై విమర్శలు రావడంతో ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్ ఆడించాలని ఐసీసీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మహారాజా టోర్నీలో కూడా మూడు సూపర్ ఓవర్‌లు ఆడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com