తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో డాక్టర్లు ధర్నాకు దిగారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మద్యానికి బానిసగా మారిన బంగారు రాజు అనే వ్యక్తి.. తిరుమలలో మద్యం దొరక్కపోవటంతో స్పృహ కోల్పోయాడు. అతన్ని గమనించిన కొంతమంది అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం బంగారు రాజును అశ్వినీ ఆస్పత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి మార్చారు. శనివారం ఉదయమే అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అయితే స్విమ్స్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత బంగారు రాజు స్పృహలోకి వచ్చాడు. ఇక మెలకువలోకి వచ్చిన తర్వాత బంగారు రాజు వింతగా ప్రవర్తించాడు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా తనకు చికిత్స చేస్తున్న లేడీ డాక్టర్ మీద దాడికి ప్రయత్నించాడు. వార్డులో అందరుముందు ఆమెపై చేయి చేసుకున్నాడు. అయితే చుట్టుపక్కల ఉన్న రోగుల బంధువులు, ఆస్పత్రిలోని వైద్యులు అడ్డుపడ్డారు. అతన్ని అడ్డుకున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మరోవైపు ఈ ఘటనతో స్విమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్లకే భద్రత లేదా అంటూ నిరసన చేపట్టారు. టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు.
మరోవైపు కోల్కతాలో లేడీ డాక్టర్పై హత్యాచార ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆసుపత్రులోని వైద్యుల భద్రత మీద ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఆస్పత్రులలో వైద్యులకు పటిష్టమైన భద్రత కల్పించాలనే డిమాండ్లు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలోనే తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ మీద రోగి దాడికి ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. దీంతో తమకు భద్రత కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే సదరు పేషెంట్ మతిస్థిమితం లేక అలా ప్రవర్తించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.