ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 02:46 PM

ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కూడా నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  అన్నారు.వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ కీలక భాగస్వామిగా మారాలని భావిస్తోందన్నారు. కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న మంత్రి ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.దేశీయంగా సమర్థతను పెంచుకోవడంతో పాటు.. బయటి నుంచి వచ్చే సవాళ్లను తట్టుకొనేలా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సీతా రామన్‌ చెప్పారు. భారత్‌లోని పెట్టుబడి అవకాశాలను ఆమె ప్రస్తావించారు. ఉపాధి కల్పనే దేశం ముందున్న అతిపెద్ద సవాలన్నారు. ''చాలా మంది యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, తమకున్న అర్హతకు, సాధించిన ఉద్యోగానికి మధ్య వ్యత్యాసం ఉందని వారు భావిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతల్లో నైపుణ్యాన్ని అందించేందుకు యువతను సన్నద్ధం చేస్తోంది'' అని ఆర్థిక మంత్రి అన్నారు.యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. భారత్‌ ప్లాస్టిక్‌ కార్డుల నుంచి క్యూఆర్‌ కోడ్‌కు వేగంగా మారినట్లు ఆమె తెలిపారు. చిరు దుకాణాలు, కూరగాయల కోసం కూడా దీనిని వినియోగిస్తున్నామన్నారు. ఫలితంగా చెల్లింపులు మరింత పారదర్శకంగా మారాయని, నగదుపై ఆధారపడటం తగ్గిందన్నారు. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధనం వైపు వేగంగా మారుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com