ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదకర వాయువులు రిలీజ్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం జరిగింది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం చోటుచేసుకుంది, కేంద్రీయ విద్యాలయంలోని సైన్స్ ల్యా్బ్‌లో శనివారం ప్రమాదకర వాయువులు రిలీజ్ అయ్యాయి. దీంతో సైన్స్‌ల్యాబ్‌లో ఉన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డారు. మరికొంత మంది ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే సిబ్బంది వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాపట్ల పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


అయితే ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు సైన్స్‌ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ప్రయోగం చేస్తున్న సమయంలోనే ప్రమాదకర వాయువులు వెలువడినట్లు సమాచారం. ప్రమాదానికి ముందు సైన్స్ టీచర్ ల్యాబ్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సమయంలోనే ల్యాబ్‌లోని విద్యార్థులు తెలియక రసాయనాలను కలిపినట్లు సమాచారం. సైన్స్ టీచర్ లేని సమయంలో విద్యార్థులు క్లోరోక్విన్, లెమన్ సోడాలో సోడియం కలపడంతో ప్రమాదకర వాయువులు వెలువడినట్లు తెలిసింది. దీంతో 24 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే కేంద్రీయ విద్యాలయం సిబ్బంది.. వీరందరినీ సూర్యలంకలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత బాపట్ల ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


అటు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ప్రమాదం నుంచి ఇంకా ఏపీవాసులు తేరుకోలేదు. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి తేరుకునేలోపే పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ సంస్థలో ప్రమాదం కలకలం రేపింది. రసాయనాలు కలిపే సమయంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలను మరిచిపోకముందే బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విషవాయువులు లీక్ అయ్యాయనే వార్త కలకలం రేపింది. అయితే ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీచర్ సమక్షంలోనే సైన్స్ ల్యాబ్‌లోకి వెళ్లాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com