ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్రం తీపికబురు.. 11చోట్ల నగరవనాలు.. నిధులు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:37 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరవనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఏపీలోని 11 ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నగరవనాల ఏర్పాటుకు గానూ తొలివిడతగా రూ.15.4 కోట్లు మంజూరు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు, కడప, చిత్తూరులో రెండు చోట్ల నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండలోనూ నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో కూడా కేంద్ర నిధుల సాయంతో నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


 మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యారు. నగరవనాల ఏర్పాటుపైనా వారితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు.. పవన్ కళ్యాణ్‌కు వివరించారు. వచ్చే వందే రోజుల్లోనే 30 నగరవనాలను పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి నగరవనాల అభివృద్ధికి వస్తున్న నిధులపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. పచ్చదనాన్ని పెంచాలని అధికారులకు సూచింంచారు. ఇదే సమయంలో ఆగస్ట్ 30వ తేదీ ఏపీవ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


వనమహోత్సవం కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించిన పవన్ కళ్యాణ్.. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊర్లో మొక్కలు నాటాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వశాఖలతో పాటుగా.. విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జనసేన పార్టీ.. జనసైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చింది. క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వేడుకలు, సహాయ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం సహా పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com