ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిందితుడికి త్వరగా శిక్షపడేలా చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:56 PM

కడప జిల్లా బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన విద్యార్థిని తల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బుధవారం ఉదయం విద్యార్థిని తల్లితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. ఆమెకు ధైర్యం చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. విద్యార్థిని కుటుంబ సభ్యలతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి.. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని బాధిత కుటుంబానికి సీఎం హామీ ఇచ్చారు.


బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాలిక తల్లికి ఉపాథి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఇంటర్ విద్యార్థిని బలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి విఘ్నేష్, బాధితురాలు స్నేహితులే. ఆపై ప్రేమించుకున్నారు. అయితే ఆరు నెలల క్రితమే యువకుడికి మరో యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం విఘ్నేష్ భార్య గర్భవతి. అయితే మరో యువతితో పెళ్లి జరిగినప్పటికి మాజీ ప్రేయసిని మాత్రం వదలలేదు విఘ్నేష్.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు యువతి అంగీకరించలేదు. దీంతో ఒకసారి కలవాలని యువకుడు కోరగా.. దానికి బాలిక నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటాన్నంటూ విఘ్నేష్ బెదిరించాడు. దీంతో తప్పక యువకుడిని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది విద్యార్థిని. కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన బాధితురాలు ఆటోలో నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న విఘ్నేశ్‌ కూడా ఆటో ఎక్కాడు. ఇద్దరూ ఆటోలో పీపీకుంట వద్ద ఉన్న సెంచురీ ప్లైవుడ్‌ సమీపంలో దిగారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఆమెపై మరోసారి ఒత్తిడి చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో కోపంతో రగిలిపోయిన విఘ్నేశ్.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు. మంటలకు తాళలేక యువతి కేకలు వేస్తూ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ డ్రైవర్ ఆమెను గమనించి వెంటనే లారీని ఆపి తన వద్ద ఉన్న దుప్పటి తీసుకొచ్చి మంటలు ఆర్పాడు. స్థానికుల సమాచారం మేరకు బద్వేల్ రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ శ్రీకాంత్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలని వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. విద్యార్థిని వాంగ్మూలాన్ని సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. వెంటనే కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com