ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:57 PM

వైసీపీకి నేతల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడారు. ఈరోజు ఆమె అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందునుంచి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె ఈ ఏడాది మార్చిలో మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా ఆమె వాయిస్ వినిపించడంలేదు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోనూ, అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపించిన వాసిరెడ్డి పద్మ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు.


మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో సరిపెట్టారని, పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడంలేదంటూ కొద్దిరోజులుగా వాసిరెడ్డి పద్మ అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్ నాయకులంతా వైసీపీని వీడుతున్న క్రమంలో తాజాగా వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదంటే వేరే ఏదైనా పార్టీలో చేరతారా అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది. రాజీనామా లేఖను ఆమె మీడియాకు విడుదల చేశారు. రాజీనామా తర్వాత జగన్‌ వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదని.. గుండె బుక్ అంటూ వాసిరెడ్డి పద్మ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రమోషన్స్ కోసం పదాలు వాడటానికి రాజకీయ పార్టీ కంపెనీ కాదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యతలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేయడంలోనూ బాధ్యత లేకుండా వ్యవహారించారని ఆమె ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణితో వ్యవహారించే నాయకుడిని ప్రజలు మెచ్చుకోరనే విషయాన్ని ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలు స్పష్టం చేశాయన్నారు. ఎన్నికలకు ముందు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్థాపంతో ఆమె పదవి నుంచి తప్పుకున్నారనే చర్చ జరిగింది. పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె అప్పట్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమె వైసీపీని వీడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com