ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెడు వ్యసనాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న విద్యార్థి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:35 PM

విద్యాభ్యాసం కోసం పొరుగు జిల్లా నుంచి బెజవాడకు వచ్చాడు. స్నేహితులతో కలిసి ఒక రూంలో ఉంటూ డిగ్రీ పట్టా పొందాడు. కాలేజీ రోజుల్లో తిరిగిన వీధులను ఇప్పుడు స్నాచింగ్‌ పాయింట్లుగా మార్చుకున్నాడు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కి పోలీసులకు దొరికిపోయాడు. ఈ వివరాలను సీసీఎస్‌ ఏసీపీ స్రవంతిరాయ్‌, ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, పటమట ఇన్‌స్పెక్టర్‌ వి.పవన్‌ కిషోర్‌తో కలిసి శుక్రవారం వెల్లడించారు. యన్నం సాయితేజరెడ్డి బీఏ పూర్తి చేశాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు వద్ద లింగంగుంట్ల గ్రామానికి చెందిన తేజ విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అతడి తండ్రి వడ్డీ వ్యాపారి. విజయవాడలో స్నేహితులతో కలిసి రూంలో ఉండేవాడు. కాలేజీ చదువుతున్నప్పుడు నగరంలో అన్ని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్నాడు. డిగ్రీ తర్వాత స్వగ్రామం వెళ్లిన తేజ వ్యవసనాలకు అలవాటుపడ్డాడు. మద్యం, సిగరెట్లు, క్రికెట్‌ బెట్టింగ్‌ల రుచి మరిగాడు. చెడు వ్యసనాలకు డబ్బులు లేకపోవడం, ప్రతిసారి ఎక్కువ మొత్తంలో తండ్రిని డబ్బులు అడిగితే అనుమానం వస్తుందన్న ఆలోచనతో చోరీలను ఎంచుకున్నాడు. నరసరావుపేట నుంచి బైక్‌ తీసుకుని, హెల్మెట్‌ వెంట పెట్టుకుని విజయవాడకు వస్తున్నాడు. స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాచవరం, పటమట ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను టార్గెట్‌ చేసుకునేవాడు. వారి పక్క నుంచి వెళ్లి మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కుని వెళ్లిపోయేవాడు. ఆ వస్తువులను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేసేవాడు. జేబులు ఖాళీ అయిన తర్వాత మళ్లీ విజయవాడకు వచ్చి స్నాచింగ్‌లు చేసేవాడు. ఈవిధంగా మాచవరం, పటమట పోలీ్‌సస్టేషన్ల పరిధిలో మూడు స్నాచింగ్‌లు చేశాడు. నరసరావుపేటలో మరో స్నాచింగ్‌ చేశాడు. విజయవాడలో ఇంకో నాలుగు స్నాచింగ్‌లకు విఫలయత్నం చేశాడు. స్నాచింగ్‌లు జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అన్ని ఫుటేజీల్లోను బైక్‌ నంబరు ఒకేలా ఉండడంతో దాని ఆధారంగా తేజ చిరునామాను పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని 87గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.6.10లక్షలు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com