ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:42 PM

ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకుని.. అనంతరం మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లిళ్లు చేసుకోవడం మన చట్టాలు అంగీకరించవు. అయితే బాంబే హైకోర్టు.. తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ముస్లిం పర్సనల్‌ చట్టాల ప్రకారం.. ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చని బాంబే హైకోర్టు వెల్లడించింది. తాము చేసుకున్న మూడో పెళ్లికి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఓ ముస్లిం వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా జడ్జి తీర్పు వెలువరించారు.


మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తి ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే అల్జీరియా అనే మహిళను తన మూడో భార్యగా స్వీకరిస్తున్నానని.. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసి.. వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని.. థానే వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతేడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మహారాష్ట్ర వివాహ బ్యూరోల నియంత్రణ-వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం ఒక్క పెళ్లిని మాత్రమే గుర్తిస్తామని.. మూడో పెళ్లి కాబట్టి అధికారంగా నమోదు చేసేది లేదని రిజిస్ట్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ ముస్లిం దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా విచారణ జరిపి తీర్పు వెలువరించింది.


ముస్లిం దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బీపీ కొలాబావాలా, జస్టిస్‌ సోమశేఖర్‌ సుదర్శన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. వారికి వివాహ ధ్రువీకరణ పత్రం అందించాలని థానే మునిసిపల్‌ కార్పొరేషన్‌ వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చని.. ముస్లిం పర్సనల్ చట్టం చెబుతుందని.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లకు అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ముస్లిం దంపతుల నుంచి కావల్సిన సర్టిఫికేట్లను తీసుకుని.. వారి పెళ్లికి అనుమతి ఇస్తున్నట్లు కానీ లేదా నిరాకరిస్తున్నట్లు కానీ 10 రోజుల్లో తెలపాలనీ కోర్టు వెల్లడించింది. అదే సమయంలో అందుకు కారణాలను కూడా వివరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com