ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి స్పెషల్.. ఆ మార్గంలో వందేబారత్ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే?

national |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:44 PM

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూ... అధునాతన సాంకేతికతను భారతీయ రైల్వే అందిపుచ్చుకుంటోంది. బ్రిటిష్ కాలంలో మొదలైన రైల్వే కాలనుగుణంగా ఎన్నో మార్పులను సంతరించుకుంది. శతాబ్ది, రాజధాని, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను నడుపుతోంది. గతేడాది పట్టాలెక్కిన వందేభారత్‌ రైల్లో ఆత్యాధునిక సౌకర్యాలు ఉండగా.. ప్రస్తుతం చైర్‌కార్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇవి తక్కువ దూరం ఉండే మార్గాలు, ప్రధాన నగరాల మధ్యే సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రానుంది. దీంతో లాంగ్ డిస్టెన్స్ మార్టంలో నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


కాగా, దీపావళి పండుగ నేపథ్యంలో మరో మార్గంలో వందేభారత్ ప్రత్యేక రైలును నడిపేందుకు రైల్వే సిద్ధమైంది. ఇదీ ఛైర్‌కార్ అయినప్పటికీ దీపావళి, ఛత్ పూజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ – పట్నాల మధ్య దీనిని నడపాలని నిర్ణయించారు. పండుగల సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు ఈ మార్గంలో వందేభారత్‌ను ప్రత్యేక రైలుగా నడిపేందుకు ముందుకొచ్చింది. ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్‌గా న్యూఢిల్లీ- వారణాసి రైలు గుర్తింపు పొందింది. తాజాగా, ఢిల్లీ నుంచి పట్నా వరకు నడిపే ప్రత్యేక రైలు అత్యంత దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నిలవనుంది


ఢిల్లీ- పట్నా మధ్య మొత్తం 994 కిలోమీటర్ల దూరం కాగా.. ఈ రైలు కేవలం 11.5 గంటల్లోనే గమ్యానికి చేర్చనుంది. ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ – పట్నా మధ్య నాలుగు రోజుల్లో 8 రౌండ్లు ప్రయాణించనుంది. అక్టోబర్ 30, నవంబర్ 1, 3 6 తేదీల్లో ఢిల్లీ నుంచి పట్నా.. అక్టోబర్ 31, నవంబర్ 2, 4, 7 తేదీలలో పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరుతుంది.


ఇక, 02252 నంబరు గల రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 8:25 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు పట్నా చేరుకుంటుంది. మార్గమధ్యంలో కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ స్టేషన్‌లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో పట్నా జంక్షన్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు న్యూఢిల్లీకి చేరుకోనుంది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ఛార్జీలలో మాత్రం మార్పులు చేయలేదు. ఢిల్లీ నుంచి పట్నాకు చైర్ కార్ ధర రూ..2,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.4,655గా నిర్ణయించారు. దీపావళి, ఛత్ పూజల సమయంలో పెద్ద సంఖ్యలో బిహార్‌‌కు వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటారు. అందుకే ఈ మార్గంలో ప్రత్యేక వందేభారత్ రైలు నడిపేందుకు సిద్ధమైనట్టు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com