శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల సాయుధ పోలీసు క్వార్టర్స్ వెనుక భాగాన ఉన్న మరిడమ్మ చెరువులో శుక్రవారం స్నానానికి దిగిన హోం గార్డు తాడివలస కాంతారావు(48) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లింగాలపేటలో నివాసం ఉంటున్న కాంతారావు తోటి హోంగార్డులతో కలిసి ఉదయం మరిడమ్మ తల్లి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు వెళ్లారు. పని పూర్తయిన తర్వాత కాంతారావు స్నానానికి దిగాడు. చెరువులో ఈదుకుంటూ మధ్య భాగానికి వెళ్లాడు. తిరిగి బయటకు రాలేక మునిగిపోతుండడంతో తోటి హోంగార్డులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించారు. ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజఈతగాళ్లను రప్పించి కాంతారావు ఆచూకీ కోసం గాలించారు. చివరికి శుక్రవారం సాయంత్రానికి మృతదేహాన్ని గుర్తించారు. కాగా కాంతారావుకు భార్య, కుమారుడు సత్యనారాయణ, కుమార్తె స్వాతి ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.