అంతరిక్ష పరిశోధనలతో శాస్త్ర సాంకేతిక రంగాలు మరింత పురోగతిని సాధిస్తాయని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త యాళ్ల శివప్రసాద్ అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం జీరోస్థాయి నుంచి ఈరోజున హీరో స్థాయికి ఎదిగిందన్నారు. పరిశోధనలతోనే ఆధునిక ప్రపంచం మరింత పురోభివృద్ధిని సాధిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఎన్నో దేశాలు నేడు అంతరిక్ష పరిశోధనలకోసం భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు వన్నెచింతలపూడి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని అమలాపురంలో జిల్లా స్థాయిలో నిర్వహించారు. ఈ వేడుకలకు విశ్రాంత శాస్త్రవేత్త శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, భారతదేశం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న ఇస్రో ప్రయోగాలను వివరించారు. అంతరిక్ష పరిశోధనలో తాను కూడా భాగస్వామిని కావడం అదృష్టమన్నారు. నేటి విద్యార్థులే భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనా రంగంలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని, దానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పీఎస్ఎల్వీ రాకెట్ (చంద్రయాన్-3) నమూనాతోపాటు పరిశోధనా ప్రదర్శనలను సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో కలిసి శివప్రసాద్ వీక్షించి అభినందించారు. సమగ్ర శిక్ష సీఎంవో బొరుసు వీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంవో పి.రాంబాబు, ఏఎల్ఎస్ఈ డి.రమేష్బాబు, ఏపీవో ఎంఏకే భీమారావు, ఐఆర్టీ జిల్లా కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, డీఎస్వో జి.సుబ్రహ్మణ్యం, హెచ్ఎం జి.నాగసత్యనారాయణ, టీవీవీ సుబ్రహ్మణ్యం, పి.శ్రీప్రకాష్, ఎన్.విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, కె.గణేశ్వరరావు, బి.సత్యనారాయణ పాల్గొన్నారు.