ముసునూరు రమణక్కపేటలో గతంలో జరిగిన ఉపాధి పనులపై విచారణ చేయిస్తాం.. అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు తేలితే శాఖాపరమైన చర్య లు తప్పవు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామసచివాలయం వద్ద గురువారం నిర్వహించిన ఉపాధి హామీ ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభలో ఉపాధి హామీ పథకంలో పను లకు రాని కూలీలకు మస్టర్లు వేయడం, వేతనాల చెల్లింపులు, పనిదినాలు కల్పిం చడంలో అధికారుల పనితీరుపై కూలీలు మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామంలో 780 జాబ్కార్డులు యాక్టీవ్లో ఉండగా, పనిదినాలు 35 వేలు మాత్రమే ఉండడం ఏమిటని, ఒక జాబ్కార్డుకు 100 రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ఎందుకు మీరు పూర్తిస్థాయిలో పనికల్పనకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీవో రోజ్లీల, ఈసీ జయప్రసాద్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా పనులు కల్పించడం ఏమిటని మండిపడ్డారు. పనికి రాకుండా మస్టర్లు వేయడం, పనిచేసిన వారికి తక్కువ వేతనాలు చెల్లించడం మీ పనితీరుకు అద్దం పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయించాలని స్థానికులు, కూలీలు కోరగా స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి దోహదం చేసే 87 రకాల పనులను ఉపాధి హామీ కింద చేపట్టుకోవచ్చన్నారు.