ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ లేని వారికి .. ప్రత్యేక క్యాంపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 08:43 PM

మనదేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకూ ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకూ అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. ఇక లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డులు చాలా కీలకంగా ఉన్నాయి. ఆధార్ కార్డులో తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా అక్కడక్కడా చూస్తున్నాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


  ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డులు లేని వారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 20 నుంచి 24వ తేదీ వరకూ ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఏపీవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే కొత్తగా ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటుగా ఐదేళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు. అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోని వారికి కూడా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పి్స్తున్నారు. బయోమోట్రిక్ అప్‌డేట్‌తో పాటుగా పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది.


ఇక ఉడాయ్ చెప్తున్న ప్రకారం కనీసం పదేళ్లకు ఓసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా గుర్తింపు కార్డులు లేదా చిరునామా తెలిపే ధ్రువపత్రాలు అందించి వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా పౌరులకు సంబంధించి తాజా సమాచారం కేంద్ర గుర్తింపు సమాచార నిధి వద్ద అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఆధార్ కార్డుల నమోదు, అప్‌డేట్ కోసం ఏపీ ప్రభుత్వం ఈ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com