ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 08:01 PM

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌ గేటు విరిగి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి 11 గంటలకు హోస్పేట వద్ద తుంగభద్ర డ్యామ్‌లో వరద తగ్గడంతో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్ నుంచి నీరు ఏకధాటిగా దిగువకు ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటివరకు లక్ష క్యూసెక్కులకుపైగా నీరు వృథాగా కిందికి పోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఒక్క గేటు విరిగి కొట్టుకుపోవడంతో.. తుంగభద్ర డ్యామ్ నుంచి 60 టీఎంసీల నీరు వృథాగా పోనుందని తెలిపారు. మరోవైపు.. షిమోగలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.


ఇక తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడంతో నీరు దిగువకు వరదలాగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నదీపరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నేపథ్యంలో సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు ఏకంగా లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇక్కడ కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. తుంగభద్ర గేటు మరమ్మతులు పూర్తి చేసే వరకు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని చెప్పారు. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టి.. విరిగిపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేయనున్నారు.


అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో డ్యాం గేట్లను మూసివేసే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నట్లు వివరించారు. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


మరోవైపు.. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు విరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డ్యామ్‌లో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. స్టాప్‌లాక్‌ అరేంజ్‌మెంట్‌ ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌ అధికారులతో మాట్లాడి.. తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేలా చూడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. అయితే డ్యామ్ పాత డిజైన్‌ కావడం వల్ల స్టాప్‌లాక్‌ గేట్‌ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని మంత్రి పయ్యావుల సీఎంకు వివరించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజినీర్ల బృందం, సెంట్రల్‌ డిజైన్‌ కమిషనర్‌ వెళ్లినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com