ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌కార్డు అప్లై చేసుకోవాలనుకొంటున్నారా.. ఇక ఆ సర్టిఫికేట్ చూపిస్తే చాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 08:03 PM

రాష్ట్రంలో అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక కొత్తగా పెళ్లయిన జంటలకు.. మ్యారేజ్ సర్టిఫికేట్‌ ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గతంలో అధికారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జారీ చేసిన రేషన్‌ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి, వైసీపీ రంగులు కలిపి ఇచ్చింది. అయితే జగన్ బొమ్మ, వైసీపీ రంగులను తొలగించి.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు.


ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 89 లక్షల రేషన్‌ కార్డులకు నిత్యావసర సరకులు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయితే వాటన్నింటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలనికేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే.. అందుకు నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటేస్తోంది.


ఇక ఇటీవలె ఢిల్లీకి వెళ్లిన కేంద్రమంత్రుల్ని కలిసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి నుంచే రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు. కొత్తగా పెళ్లి అయిన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ అంటూ రూ.1800 కోట్లు వృథా చేసిందని మంత్రి మనోహర్ మండిపడ్డారు. రేషన్ డోర్ డెలివరీపై కేబిటనెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


అయితే గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం.. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని 2020లో ప్రకటించింది. అయితే ఆ తర్వాత కొన్నిరోజులకు.. సచివాలయాల ద్వారా కేవలం రెండున్నర గంటల్లోనే రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 1.10 లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసింది. 2019 జూన్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులు ఉండగా.. 2024 ఆగస్టు వరకు వాటి సంఖ్య 1,48,43,671కి పెరిగింది.


మరోవైపు.. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు జారీ చేయాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. అయితే వాటికి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్ కార్డులు అందలేదు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్‌ కార్డు జారీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com