ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 03:35 PM

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆతర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను. అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకులచుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులసహా, ఇన్సూరెన్స్‌ ప్రీమియంకట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్మును తక్షణమే విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com