సోమశిల ప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా పారిపోయారని ఆరోపించారు. శనివారం నాడు జెడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం సోమశిల పనులు చేయలేదు కాబట్టే, తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు.