ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విచిత్రమైన ఘటన జరిగింది. పట్టణంలోని ఓ ఏటీఎంలో నుంచి నోట్ల వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికి తెలియడంతో.. కొందరు కస్టమర్లు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు అధికారులతో కలిసి ఏటీఎంను మూసివేయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత బ్యాంకు అధికారులు ఏటీఎంలో మరమ్మత్తులు చేసి మళ్లీ ఏటీఎంను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో.. ఏటీఎం కార్డు పిన్ నంబర్ సెట్ చేస్తానని చెప్పి కార్డు తీసుకొని డబ్బుల కాజేశాడో వ్యక్తి. ఉదయగిరి మండలంలోని పుల్లాయపల్లికి చెందిన జె గురునారాయణకు కొత్తగా ఏటీఎం కార్డు వచ్చింది.. దీనికి పిన్ నంబర్ చేసుకొనేందుకు ఉదయగిరి స్టేట్ బ్యాంకు ఏటీఎంకు వెళ్లాడు. అతడికి తెలియకపోవడంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సాయం చేయమని అడిగాడు. అతడు ఏటీఎం కార్డు తీసుకొని పిన్ నంబర్ సృష్టించాడు.. అనంతరం తన దగ్గర ఉన్న కార్డును గురునారాయణకు ఇచ్చి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.
డబ్బులతో పారిపోయిన వ్యక్తి వెంటనే పక్కనే ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకులో కార్డుతో కారుకు రూ. 4500లకు పెట్రోల్ పట్టించుకున్నట్లు గుర్తించారు. అనంతరం దుత్తలూరు ఏటీఎంలో రూ.40 వేలు డ్రా చేశాడు.. అకౌంట్ నుంచి నగదు డ్రా అయినట్లు గురునారాయణ మొబైల్కు మెసేజ్ రావడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం కార్డు కాజేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ఉదయగిరి, దుత్తలూరులో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు. త్వరలోనే కార్డు ఎత్తుకెళ్లిన వ్యక్తిన పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ ఘటన ఏటీఎం కార్డు మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.