ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి లెక్క త‌ప్పింది....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 08:29 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో విజయవాడ మాజీ ఎంపీ  రాజగోపాల్ ప్రకటించిన అంచనాలు తారుమా రయ్యాయి. అంతకుముందు వాస్తవ ఫలితాలకు దగ్గరగా అంచనాలను ప్రకటించిన లగడపాటి రాజగోపాల్... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఘోరంగా విఫలయ్యారు. దీంతో ఇక లగడపాటి సర్వేల పని అయిపోయినట్టే అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇక తన సర్వే ఫలితాలు తారుమారు కావడంతో... లగడపాటి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు బయట కనిపించినా... మీడియాతో పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. అలాంటి లగడపాటి రాజగోపాల్ మళ్లీ హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చిన తెలంగాణపై తన అంచనాలు తప్పే విషయంపై వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. లగడపాటి సర్వే అంచనాలను అంతా మర్చిపోయిన సమయంలో ఆయన మళ్లీ తెరపైకి రావడం విశేషం. అయితే మళ్లీ లగడపాటి వార్తల్లో నిలవడం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో తరచూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును కలుస్తున్న లగడపాటి రాజగోపాల్... ఆయనకు సర్వే నివేదికలను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైకి వ్యక్తిగత కారణాల వల్లే తాను చంద్రబాబును కలుస్తున్నానని లగడపాటి చెబుతున్నా... అందుకోసం ఇన్ని సార్లు కలవడం ఎందుకునే సందేహాలు కూడా తలెత్తున్నాయి. కొందరైతే... లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని... టీడీపీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారని కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చిన లగడపాటి... తాను మళ్లీ రాజకీయాల్లోకి రావడం లేదని...సర్వేలు చేయడం కొనసాగిస్తానని వెల్లడించారు.
మరోవైపు తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు రావడం వ్యూహాత్మకమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణపై తన అంచనాలు తప్పాయని అంగీకరిస్తూనే... ఓటింగ్ శాతం వెల్లడించడానికి అంత సమయం ఎందుకు పట్టిందో అర్థంకావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూర్చేందుకే లగడపాటి మరోసారి తెరపైకి వచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్... ఏపీలో జరగబోయే ఎన్నికలకు ముందు ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com