ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 12:22 PM

సీఎం జగన్‌ జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్‌ను బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం బనగానపల్లెలో విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి దూకుడు పెంచింది. జగన్‌ అరాచక పాలన అంతం - కూటమి పంతం.. కూటమి రూపొందించిన జగనాసుర రక్త చరిత్ర పేరుతో రూపొందించిన చార్జిషీట్‌ను బనగానపల్లెలో జరిగిన కార్యక్రమంలో బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, యువ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగల పరమే శ్వరరెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, బురానుద్దీన్‌, కాశీంబాబు, రాయలసీమ సలాం తదితరుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. వైసీపీ పెత్తందారీ పాలన లో రాష్ట్రం విధ్వంసం అయిందని, సీఎం జగన్‌కు ఏమాత్రం విశ్వసనీయత, నైతికత లేదని విమర్శించారు. ఐదేళ్ల నిరంకుశ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల భారం మోపాడన్నారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేసి, 30వేల మంది మహిళల మాంగల్యాలను తెంచారన్నారు. 10సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.75వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. వందకు పైగా గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన టీడీపీ పథకాలు రద్దు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను 600 మందిని వైసీపీ ప్రభుత్వంలో హత్య చేశారన్నారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌ రాష్ట్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేశారన్నారు. ఇలా ఎన్నో నేరాలు ఘోరాలు చేసినందుకు జగనాసుర రక్త చరిత్ర అంటూ జగన్‌ అరాచక పాలనపై ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో రూపొందించిన చార్జీ షీటును ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నట్లు బీసీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com