ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 08:19 PM

టీడీపీ నేత జంగా కృష్ణమూర్తికి హైకోర్టులో కాస్త ఊరట దక్కింది. తనపై ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. అసలు వివరాల్లోకి వస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలు టీడీపీలో చేరగా.. జంగా కృష్ణమూర్తి సైతం పసుపు కండువా కప్పుకున్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరం అంటూ.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీలో చేరిపోయారు. వైసీపీలో అవమానాలు తట్టుకోలేకే తాను వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారంటూ వైసీపీ ఆయనపై ఫిర్యాదు చేసింది.శాససనమండలి ఛైర్మన్‌కి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. ఆయన చర్యలు తీసుకున్నారు. జంగా కృష్ణమూర్తి మీద అనర్హత వేటు వేశారు. అయితే తనపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ.. జంగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ మీద విచారణ సందర్భంగా తనపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని జంగా కృష్ణమూర్తి తరుఫు న్యాయవాదులు వాదించారు. తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారనీ.. ఇది కక్షపూరితమైన చర్యగా జంగా కృష్ణమూర్తి పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేల మీద ఏళ్ల తరబడి చర్యలు తీసుకోకుండా.. తనపై మాత్రం వేటు వేయడం ఏమిటంటూ జంగా కృష్ణమూర్తి పిటిషన్‌లో ఆరోపించారు.


విచారణ సందర్భంగా పిటిషనర్ తరుఫు న్యాయవాది కూడా జంగా కృష్ణముూర్తిపై నిబంధనలను విరుద్ధంగా అనర్హత వేటు వేశారంటూ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు.. జంగా కృష్ణమూర్తి స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.


మరోవైపు జంగా కృష్ణమూర్తితో పాటుగా మహ్మద్ ఇక్బాల్, సి. రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరిపోయారు. ఇక్బాల్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరగా.. సి. రామచంద్రయ్య మీద కూడా ఎమ్మెల్సీగా అనర్హత వేటు పడింది. వీరిద్దరి స్థానంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించగా.. సి. రామచంద్రయ్య టీడీపీ తరుఫున మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలాగే జనసేన నేత హరిప్రసాద్‌కు ఎమ్మెల్సీ స్థానం దక్కింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com