ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో.. పిఠాపురంలో కోట్లల్లో పలుకుతున్న భూములు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 09:27 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురం రాత మారిపోయినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్నారనగానే రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో వీఐపీల తాకిడి, ప్రచారంతో ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది పిఠాపురం. ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఎన్నికల ఫలితాల సమయంలో పిఠాపురం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనితో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.ఇక పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత పిఠాపురంలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయినట్లు చెప్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎకరా భూమి 15 నుంచి 16 లక్షలు పలికేదని సమాచారం అలాగే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు అయితే ఎకరా 50 లక్షల వరకూ పలికేదని స్థానికులు చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎకరా భూమి కోటి రూపాయలు పలుకుతున్నట్లు టాక్. హైవేకు ఆనుకుని ఉన్న భూములు అయితే ఒక్కోచోట రూ.3 కోట్ల వరకూ పలుకుతున్నట్లు సమాచారం.


పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి గానూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3.52 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, మిగతా స్థలంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీటితో పాటు మరో పవన్ కళ్యాణ్ మరో 16 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. పవన్ కళ్యాణ్ భూములు కొన్న ప్రాంతంలోని భూములను కొనుగోలు చేసే పనిలో పడినట్లు సమచారం. పవన్ భూములకు పక్కనున్న భూములను సొంతం చేసుకునేందుకు ఆ భూమి యజమానులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది.


దీంతో పవన్ కళ్యాణ్ భూములు కొనడంతోనే తమ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లు పిఠాపురం వాసులు చెప్తున్నారు. గతంలో పిఠాపురంలో రోడ్డు ఆనుకుని ఉన్న భూములు ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.1.25 కోటి వరకూ పలికేదని.. ఇప్పుడైతే రూ.3 కోట్లకు చేరిందని చెప్తున్నారు. అలాగే కాస్త లోపలికి ఉన్న భూములు రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ పలుకుతున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందనేది స్థానికులు చెప్తున్న మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com