ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌తో డిబేట్‌.. బైడెన్ తీరుపై మండిపడుతున్న సొంత పార్టీ.. తప్పుకోవాలని డిమాండ్లు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 11:17 PM

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా.. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు తమ తమ పార్టీల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని విజయం సాధించిన ఈ ఇద్దరు నేతలు తొలిసారిగా డిబేట్లలో ప్రత్యక్షంగా ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డిబేట్‌లో తన దూకుడు ప్రదర్శించారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మాత్రం కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో ఇప్పుడు జో బైడెన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిబేట్‌లో ట్రంప్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో సొంత పార్టీ నుంచే జో బైడెన్‌ను అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బైడెన్ తీరుపై డెమోక్రాట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ ఏడాది నవంబర్ 5 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడెన్ బరిలో నిలిచారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి మాజీ అధ్యక్షుడు 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఈ ఇద్దరు రెండు నేతలు.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారి డిబేట్‌లో ఎదురుపడ్డారు. అట్లాంటాలోని సీఎన్ఎన్ ఆఫీస్‌లో జరిగిన ఈ 90 నిమిషాల డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా బైడెన్, ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.


 అయితే ఈ డిబేట్‌కు ముందుగానీ తర్వాత గానీ.. ఇద్దరు నేతలు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం గమనార్హం. ఇక నిబంధనల ప్రకారం ఈ డిబేట్‌లో కేవలం నిర్వహకులు మాత్రమే పాల్గొనగా.. ట్రంప్, బైడెన్‌‌లలో ఒకరు మాట్లాడుంటే మరొకరి మైక్‌లను మ్యూట్‌ చేశారు. ఇక ఈ డిబేట్‌పై సీఎన్ఎన్ నిర్వహించిన పోల్‌లో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం 90 నిమిషాల డిబేట్‌లో ట్రంప్‌ 23 నిమిషాల 6 సెకన్లు.. బైడెన్‌ 18 నిమిషాల 26 సెకన్లు మాట్లాడారు.


చర్చలో భాగంగా సంయమనం కోల్పోయిన బైడెన్‌, ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ దూకుడు ప్రదర్శించగా.. కొన్నిచోట్ల బైడెన్‌ తడబడ్డారు. బైడెన్‌ ఒక ఫెయిల్యూర్‌ అని ట్రంప్‌ పేర్కొనగా.. దానికి గట్టిగా బదులిచ్చిన బైడెన్‌.. ట్రంప్‌ దోషి అంటూ ఆరోపించారు. ట్రంప్‌ సర్కార్.. ధనికులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని.. నిరుద్యోగం 15 శాతానికి చేరిందని బైడెన్ మండిపడ్డారు. అయితే వాటిని ఖండించిన ట్రంప్.. బైడెన్‌ ప్రభుత్వంలో కేవలం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ట్రంప్‌ విమర్శించారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని.. ట్యాక్స్ కట్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత దారుణస్థితిని ఎదుర్కొంటోందని ఆరోపించారు.అమెరికా విదేశాంగ విధానం, అబార్షన్, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్‌-19, సామాజిక భద్రత, మెడికేర్‌, ట్యాక్సు‌లు, ట్రంప్‌పై కేసులు, 2020 క్యాపిటల్‌ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలను చర్చించారు.


అయితే ఇద్దరు నేతలు డిబేట్‌లో ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహావేశాలతో కనిపించారు. అయితే బైడెన్ కంటే ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శించారు. కొన్ని విషయాల్లో ట్రంప్‌ను కట్టడి చేయడంలో బైడెన్ వెనుకంజ వేయడంతో ఆయన సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే డిబేట్‌లో ట్రంప్‌ను నిలువరించడంలో బైడెన్ విఫలం అయ్యారని డెమోక్రాట్ల నుంచే తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా వయసు కారణంగా బైడెన్ చురుగ్గా డిబేట్‌లో పాల్గొనలేకపోయారని మండిపడుతున్నారు. బైడెన్ కారణంగా డెమోక్రటిక్ పార్టీ వెనుకడుగు వేస్తోందని.. ఆయన పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com