ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోమ్ లోన్ పన్ను రాయితీ రూ.5 లక్షలకు పెంపు? బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం ఆశలు

business |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 10:59 PM

కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కసరత్తు చేపట్టింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్. ఈ క్రమంలో దేశ రియల్ ఎస్టేట్ రంగం పలు ప్రోత్సాహకాలను ఆశిస్తోంది. దేశాభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో 2024-25 పూర్తి కాల బడ్జెట్‌లో పలు ప్రోత్సహకాలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా పూర్తి స్థాయి పరిశ్రమ హోదా కల్పించడం, హోమ్ లోన్ వడ్డీపై రాయితీ రూ.5 లక్షలకు పెంపు వంటివి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్లు.


రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి స్థాయి పరిశ్రమ హోదా దక్కితే అవసరమైన పన్ను ప్రయోజనాలు లభిస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చట్టపరమైన, పన్ను ప్రోత్సాహకాలు, లోన్ల మంజూరు వంటివి ఉంటాయంటున్నారు. కేంద్రం ఇటీవలే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుతం నిర్మాణ వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. ధరలను దృష్టిలో ఉంచుకుని ఆవాస్ యోజనను మరిన్ని వర్గాలకు వర్తించేలా వెసులుబాట్లు కల్పించాలని కోరుతున్నారు.


మరోవైపు.. గృహ రుణాలపై పన్ను రాయితీల పెంపు సైతం చాలా కాలంగా వినిపిస్తున్న ఒక డిమాండ్. ట్యాక్స్ మినహాయింపులు కల్పించడం ద్వారా గృహ కొనుగోలుదారులతో పాటు పరిశ్రమకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతం ఆదాయపు పన్ను రాయితీ రూ.2 లక్షల వరకు ఉంది. దానిని రూ. 5 లక్షలకు పెంచాలని ఎంతో కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ 3.oలో ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌లో పన్ను రాయితీ పరిమితిని పెంచుతారని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.


వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తే రియల్ ఎస్టేట్, దాని అనుబంధన రంగాల వారికి మేలు జరుగుతుందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్లకు స్థిరమైన డిమాండ్ ఉండేలా చూడడం చాలా కీలకం. రియల్ ఎస్టేట్ అనేది 200 అనుబంధ రంగాలకు చోదకశక్తిగా పని చేస్తుందని, భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ రంగం దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2024-25 బడ్జెట్‌లో గృహ రుణాలకు పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే రెసిడెన్షియల్ యూనిట్లకు డిమాండ్ పెరుగుతుందని, అలాగే రియల్ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదా మంజూరు చేసినట్లయితే నిధుల లభ్యత సులభతరం అవుతుందంటున్నారు. మరి చూడాలి జులైలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయో.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com