ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్య వాగ్దాటి ముందు మేమెంత? ప్రధాని మోదీ ప్రశంసలు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 08:30 PM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవన ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను ఆదివారం ప్రధాని ఆవిష్కరించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ‘వెంకయ్య నాయుడు.. లైఫ్ ఇన్ సర్వీస్’, ‘సెలబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ 13వ వైస్-ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు జీవితచరిత్ర పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, ఇవి దేశ పౌరులకు మార్గనిర్దేశం చేస్తాయని వ్యాఖ్యానించారు. గ్రామీణం ప్రాంతం నుంచి వెంకయ్య ఉన్నత స్థానానికి ఎదిగారని మోదీ కొనియాడారు. ‘‘రేపు జులై 1 వెంకయ్య నాయుడు పుట్టినరోజు. ఆయన జీవిత ప్రస్థానంలో 75 ఏళ్ల పూర్తవుతాయి.. ఈ 75 ఏళ్లలో ఆయన అసాధారణ విజయాలు సాధించారు.. 75 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు’’ అని అన్నారు.


‘ఈరోజు ఆయన జీవిత చరిత్రతో పాటు మరో 2 పుస్తకాలను విడుదల చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది... ఈ పుస్తకాలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయి.. దేశసేవకు సరైన మార్గనిర్దేశం చేస్తాయని నేను నమ్ముతున్నాను.. వెంకయ్యనాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు లభించింది.. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారు.. ఎమర్జెన్సీ సమయంలో ఆయన పోరాటం చేశారు.. 17 నెలల జైల్లో ఉన్నారు.. కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి ఎన్నో పథకాలను సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు’ అని మోదీ ప్రశంసించారు.


‘వెంకయ్య నాయుడు.. లైఫ్ ఇన్ సర్వీస్’ పుస్తకాన్ని ది హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ కుమార్ రాయగా.. సెలబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ 13వ వైస్-ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి మాజీ కార్యదర్శి ఐవీ సుబ్బారావు, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’సంజయ్ కిశోర్‌లు రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com