ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్ కప్ కొట్టిన టీమిండియా.. రోహిత్ సేనపై యూపీ, ఢిల్లీ, ముంబై పోలీసుల ట్వీట్లు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 10:50 PM

శనివారం జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను ఒడిసిపట్టిన రోహిత్ సేనపై 140 కోట్ల మంది భారతీయులు అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రాజకీయ నాయకులు, సినీ, బిజినెస్ ప్రముఖులు కూడా రోహిత్ సేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు విభాగం కూడా స్పందించింది. ఈ నేపథ్యంలోనే యూపీ పోలీస్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలుపుపై ట్వీట్ చేసిన యూపీ పోలీస్ విభాగం.. "బ్రేకింగ్‌ న్యూస్‌.. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అంతేకాకుండా భారత్‌లోని కోట్లాదిమంది క్రికెట్‌ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు" అని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో యూపీ పోలీసులు చేసిన ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్‌కు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


ఇక ఇదే మ్యాచ్‌పై ఢిల్లీ పోలీసులు కూడా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలని దేశ ప్రజలంతా 16 ఏళ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచి చూశాం. ఇదే విధంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కూడా ఓపికతో వేచి ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమిండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


ఇక ముంబై ట్రాఫిక్ పోలీసులు కూడా మరో ట్వీట్‌తో టీమిండియా గెలుపును సంబరం చేసుకున్నారు. డ్రీమ్ నంబర్ ప్లేట్ నిజం అయిందంటూ ఓ కారును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నడుపుతున్నట్లు ఒక ఫోటోను షేర్ చేశారు. IND 29 JUNE 2024 నంబరుతో ఉన్న కారు ఫోటోను ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. మరోవైపు.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు, ఫోటోలు, అభినందనలతో టీమిండియాను ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ కొట్టిన ఆనందం ఓ వైపు ఉండగా.. టీమిండియా స్టార్ ప్లేయర్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను కలిగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com