ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ.. లోక్‌సభలో ఆసక్తికర పరిణామం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 10:04 PM

మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ.. ప్రాంతీయంగా ఉన్న భాషల పట్ల స్థానికులకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఇక దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు ఉన్నాయి. ఇందులో దేశం మొత్తంలో తమిళులకు తమ భాష అంటే మక్కువ ఎక్కువ అని అందరూ అంటుంటారు. తమ భాష మీద ఉన్న అమితమైన ప్రేమతో ఒకప్పుడు హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలను నేర్చుకోవడానికి కూడా తమిళనాడు ప్రజలు ఇష్టపడలేదంటే వారికి తమ భాషపై ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది.. తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ లోక్‌సభలో తెలుగులో ప్రమాణం చేయడం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.


తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె.గోపీనాథ్.. మంగళవారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక చేతితో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన కె.గోపీనాథ్.. సభకు నమస్కారం అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం మొత్తం తెలుగులోనే చేసిన ఆయన.. ఆఖర్లో నండ్రి, వణక్కం, జై తమిళనాడు అంటూ తమిళంతో ముగించారు. అయితే కె. గోపీనాథ్ తమిళంలో కాకుండా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆయన మాతృభాష తెలుగు కాగా.. తమిళనాడులో స్థిరపడ్డారు.


గతంలో మూడుసార్లు హోసూర్ నుంచి కె.గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2006, 2011లో వరుసగా గెలిచిన గోపీనాథ్.. 2016లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.బాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈసారి కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయనను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. తొలిసారి ఎంపీగా పోటీచేసిన గోపీనాథ్ ఇండియా కూటమి తరఫున గెలుపొందారు. తమిళనాడులో కృష్ణగిరి, హోసూర్.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి కృష్ణగిరి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక హోసూర్.. సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండస్ట్రియల్ హబ్ అయిన హోసూర్‌లో చాలా ఏళ్ల కిందటే తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. సుమారు 50 శాతం మంది తెలుగువారు హోసూర్‌లో స్థిరపడినట్టు అంచనా. హోసూర్‌లో ఉన్న వ్యాపారవేత్తల్లోనూ తెలుగువారే ఎక్కువ. ఇప్పుడు కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలిచిన గోపీనాథ్ కూడా హోసూర్‌లో వ్యాపారవేత్త. ఈయన పూర్వీకులు ఏపీ నుంచి హోసూర్ వెళ్లి వ్యాపారాలు చేశారు. అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్ హోసూర్‌లోనే పుట్టారు. అయినప్పటికీ మాతృభాష మీద మమకారంతో తెలుగులో ప్రమాణం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com