ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంల ట్యాంపరింగ్ శుద్ధ అబద్ధం.. మా పార్టీ ఓటమికి అదొక్కటే కారణం: వైసీపీ సీనియర్ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 08:33 PM

దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై చర్చ జరుగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్‌సీపీ ఈవీఎంల విషయంలో అనుమానాలు వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఈవీఎంల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, అమలాపురం నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు శుద్ధ అబద్ధమని ఒక్కమాటలో తేల్చి చెప్పారు. గతంలో అన్ని పార్టీలు విడిగా పోటీచేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో తమకు తెలుసని.. ఇప్పుడు మూడు పార్టీలు కలిసిపోవడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయాయని.. కానీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఓటు బ్యాంకు బదిలీ అయ్యిందని వ్యాఖ్యానించారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందన్నారు.. జనం వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు.. టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు.. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు.. జనసేనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదన్నారు.


మరోవైపు ఈవీఎంల క్రాస్‌ వెరిఫికేషన్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దేశ వ్యాప్తంగా 11 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని ఈసీనే తెలియజేసింది.. ఈ 11మందిలో 8 లోక్‌సభ స్థానాల పరిధిలో 92 పోలింగ్ కేంద్రాలు.. 3 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 26 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయాలని వారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఏపీ నుంచి ఈసీకి దరఖాస్తులు చేశారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ పరిధిలోని ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దరఖాస్తు చేశారు. ఇటు గజపతినగరం అసెంబ్లీ స్థానంలోని ఒక పోలింగ్‌స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 12 పోలింగ్‌ స్టేషన్లలో ఈవీఎంలను పరిశీలించాలని అక్కడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి విన్నవించారు.


అటు తెలంగాణ నుంచి కూడా ఎన్నికల సంఘానికి ధరఖాస్తులు అందాయి. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు, జహీరాబాద్‌లో ఏడు, ఆందోల్‌ నియోజకవర్గంలోని 6 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి బీజేపీ అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నారు. మిగిలినవి వివిధ రాష్ట్రాలకు చెందినవిగా ఉన్నాయి. ఆయా కోర్టుల్లో దాఖలయ్యే ఎన్నికల పిటిషన్ల పరిస్థితి ఆధారంగా.. ఈ దరఖాస్తులపై తనిఖీ చేపడతామని ఎన్నికల సంఘం చెబుతోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈవీఎంల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com