ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయిలో ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 07:57 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయిలో ప్రమాదం జరిగింది. వైఎస్ జగన్ శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ .. శనివారం సొంతూరికి బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయంలో దిగారు. ఇక అక్కడి నుంచి కారులో పులివెందుల వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కారులో పులివెందుల వెళ్తున్న సమయంలో రామరాజుపల్లి వద్ద వైఎస్ జగన్ కాన్వాయిలోని వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. వైఎస్ జగన్ కాన్వాయిలోని ఇన్నోవా కారు.. ఫైర్ ఇంజిన్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


అయితే వైఎస్ జగన్‌ను చూడ్డానికి జనం ఎగబడటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. జగన్ వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై గుమికూడారు. వారిని పలకరించేందుకు జగన్ కాన్వాయిని కాస్త స్లో చేశారు. దీంతో కాన్వాయిలోని కారు.. ముందున్న ఫైరింజన్ ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక పర్యటనలో భాగంగా మూడురోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ ఉన్నారు.


 ఈ మూడురోజుల సమయంలోనే వైఎస్ జగన్.. వైఎస్ఆర్ ఘాట్ సందర్శిస్తారు. అలాగే రాయలసీమలోని వైసీపీ నేతలతో భేటీ అవుతారు. రాయలసీమలో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఉత్తరాంధ్ర సంగతి ఎలా ఉన్నప్పటికీ తమ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉండేది. అయితే ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలోనూ ఆ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 11 సీట్లు వస్తే.. రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కడపలోనూ వైసీపీకి దారుణ ఫలితాలు వచ్చాయి.


ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. గతంలో ఎప్పుడూ కూడా కడప జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లా నేతలతో, అలాగే కడప లీడర్లతో వైఎస్ జగన్ భేటీకానున్నారు. ఓటమికి గల కారణాలను ఆరా తీయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com