ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ స్పీకర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 07:42 PM

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. లోక్‌సభ స్పీకర్ కుర్చీలో ఎవర్ని కూర్చోబెట్టాలా అని బీజేపీ హై కమాండ్ తర్జన భర్జన పడుతోంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్‌ల వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.


రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ఆ ప్రొటెం స్పీకర్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. అయితే ప్రొటెం స్పీకర్‌ రేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు.. స్పీకర్ ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, ప్రొటెం స్పీకర్‌‌గా ఎవరిని నియమించాలి అనేదానిపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం బీజేపీతోపాటు ఎన్డీఏ కూటమిలోని కేంద్రమంత్రులు.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్‌ ఎవరూ అనేదానిపై స్పష్టత రానుంది.


అయితే ఈసారి సొంతంగా బీజేపీకి లోక్‌సభలో మెజార్టీ మార్కుకు అవసరమైన సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు అవసరం అయింది. ఈ క్రమంలోనే మిత్ర పక్షాలు.. లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం.. ఆ లోక్‌సభ స్పీకర్ పదవిని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు. ఇక త్వరలోనే లోక్‌సభ సమావేశాలు జరగనుండటంతో స్పీకర్ ఎవరూ అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు.. దేశ చరిత్రలో ఇప్పటివరకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రతీసారి ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుని వారినే స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎవరికి ఆ పదవి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది.


2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో సొంతంగానే అధికారాన్ని చేపట్టింది. దీంతో ఎవరి అవసరం లేకుండానే ఆ పార్టీ ఎంపీలే స్పీకర్‌లుగా నియమించబడ్డారు. 2014 లో 16వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్‌.. 2019 లో 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను ప్రధానమంత్రిగా నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com