ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు.. వైఎస్ జగన్ డౌటేనా?.. కారణమదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 07:52 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. తొలుత జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా జూన్ 21 నుంచి అసెంబ్లీ మీటింగ్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలుత ప్రొటెం స్పీకర్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికైన, సుధీర్ఘ అనుభవం ఉన్న నేతను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది.


మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడిని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపై ఇంకా క్లారిటీ లేదు. ఇక కొత్తగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేలతోనూ ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జూన్ 21వ తేదీన తొలుత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. టీడీపీ నుంచి 135, జనసేన నుంచి 21, వైసీపీ 11, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


జూన్ 19వ తేదీ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రానుంది. అయితే జూన్ 21, 22న జరిగే సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


వైఎస్ జగన్ జూన్ 19 నుంచి 21 వరకూ పులివెందులకు వెళ్లనున్నారు. 21వ తేదీ మధ్యాహ్నం పులివెందుల నుంచి బయల్దేరి తాడేపల్లికి చేరుకుంటారు. మరి పులివెందుల నుంచి తిరిగి వచ్చి సమావేశాలకు వెళ్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మిగతా వైసీపీ శాసనసభ్యులు హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వైఎస్ జగన్ మరోసారి విడిగా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com