ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే జనరల్ బోగీల సంఖ్య భారీగా పెంపు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 08:09 PM

మన దేశంలో ప్రజా రవాణాకు రైళ్లే ప్రధాన ఆధారం. సామాన్యులు జనరల్ టికెట్లు కొనుక్కుని.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో.. అందులో ప్రయాణించాలంటే ప్రయాణికులు నిత్యం ఒక యుద్ధం చేయాల్సిందే. కిక్కిరిసిపోయి ఉండే జనరల్ బోగీల్లో ప్రయాణం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలను రోజురోజుకూ ఆధునికరిస్తూనే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను తగ్గిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. జనరల్ బోగీల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. దేశంలో రైల్వేల మౌలిక సదుపాయాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రత్యేక డ్రైవ్ కింద దేశంలో మరో 2500 జనరల్‌ కోచ్‌ల తయారీ చేపట్టినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటికి అదనంగా మరో 10 వేల జనరల్‌ కోచ్‌లకు ఆమోదం లభించిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు.. ఈ ఏడాది వేసవిలో ప్రయాణికుల భారీ రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 10 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపిందని పేర్కొన్నారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యం కసరత్తు చేస్తోందని వివరించారు.


మరోవైపు.. ఇప్పటికే దేశంలో 50 అమృత్‌ భారత్‌ ట్రైన్ల తయారీ ప్రారంభమైందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. మరో 150 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది 5300 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా 800 కిలోమీటర్ల పైగా ట్రాక్‌లను నిర్మిస్తామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్‌లపై కవచ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు.


ఇక 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు.. అహ్మదాబాద్-ముంబై మధ్య అందుబాటులోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 నాటికి దేశ తొలి బుల్లెట్ రైలు సిద్ధంగా ఉంటుందని.. అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పొడవు 508 కిలోమీటర్లు అని చెప్పారు. 2028లో పూర్తిస్థాయి హైస్పీడ్ రైలు విస్తరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com