ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కీలక నిర్ణయం.. ఉత్తరాంధ్రకు పెద్దపీట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 07:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకారం దగ్గర నుంచి మంత్రులకు శాఖల కేటాయింపు వరకూ అంతా పూర్తైంది. ఇక పాలనను మొదలెట్టడమే తరువాయి. అయితే ఏపీలో పార్టీని ముందుకు నడిపించే కీలక బాధ్యతను.. చంద్రబాబు సీనియర్ నేతకు అప్పగించనున్నట్లు తెలిసింది. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి మరోసారి ఉత్తరాంధ్రకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.


తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ నేత అయిన పల్లా శ్రీనివాస్‌ను అధ్యక్షుడిని చేయాలని.. చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు తెలిసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తొలుత కిమిడి కళా వెంకట్రావు పనిచేశారు. ఆ తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడికి ఆ పదవి దక్కింది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్ర నేతకు ఆ అవకాశం ఇవ్వాలని అధినేత మనసులో ఉన్నట్లు సమాచారం.


2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో గాజువాకలో త్రిముఖ పోరు నెలకొంది. దీంతో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించగా.. పల్లా శ్రీనివాసరావు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పల్లా శ్రీనివాసరావు గ్రాండ్ విక్టరీ కొట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి వైసీపీ తరుఫున గుడివాడ అమర్‌నాథ్ పోటీచేయగా.. పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల తేడాతో గుడివాడ అమర్నాథ్ మీద విజయం సాధించారు.


మరోవైపు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడంతో పాటుగా.. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. సీనియర్లకు ఆ ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com