ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు షాక్.. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో సూట్‌కేసులు కొరికేసిన ఎలుకలు!

national |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:47 PM

ఇళ్లలో సామాన్లను, సూట్‌కేసులను ఎలుకలు చిందరవందర చేయడం.. కొరికేయడం సర్వసాధారణం. కానీ ఇలాంటి ఘటన విలాసవంతమైన ప్రయాణానికి కేరాఫ్‌గా చెప్పుకునే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో చోటుచేసుకుంది. ఓ రైల్లో ప్రయాణికులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా- ముంబయికి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌లో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో రైల్వే శాఖ తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైల్లో తన సూట్ కేసులను ఎలుకలు ఎలా కొరికాయో చూడండంటూ బాధితుడు ఫొటోలు, వీడియోలను ఎక్స్ (ట్విట్టర్)‌లో షేర్ చేశాడు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు.


‘మే 19న 12102 నెంబరు రైలు ఎక్కాను.. హెచ్ 1 కోచ్ ఏ2 సీట్లో ప్రయాణించాను. పీఎన్ఆర్ నంబర్ 6535087042. . నా లగేజీని ఎలుకలు కొరికేశాయి.. సూట్‌కేసులు ఎలా పాడైపోయాయో చూడండి... ఫిర్యాదు చేయడానికి అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఓ ప్రయాణికుడు ఫొటోలు, వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ.. ‘ఈ అంశం చాలా ఆందోళన కలిగిస్తోంది.. మీకు వీలైనంత త్వరగా సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. రైల్వే డివిజనల్ మేనేజర్ ద్వారా మీ మొబైల్ నంబర్ వివరాలు సేకరించాల్సి ఉంది.. అవసరమైతే railmadad.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 139కు డయల్ చేసి సత్వర పరిష్కారం పొందొచ్చు’ అని రిప్లయ్ ఇచ్చింది.


కానీ, రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది సేవా లోపం కిందకు వస్తుందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వే... ప్రయాణికులు లగేజినీ ఎలుకలు కొరికేస్తే వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


అయితే, ఈ ఏడాదది మార్చిలోనూ ఈ తరహా ఘటన వెలుగు చూసింది. భువనేశ్వర్–జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో ఎలుకల తిరుగుతుండటంతో ఓ ప్రయాణికురాలు గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే గతేడాది అక్టోబరులోనూ మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కార్‌లో ఆహార పదార్థాలను ఎలుకలు, పరుగులు తింటున్న దృశ్యం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఇక, రైళ్లలోని అపరిశుభ్ర పరిస్థితులు, ఏసీ కోచ్‌లు జనరల్ బోగీలను తలపించే సంఘటనలపై తరుచూ ప్రయాణికులు ఏకరవు పెడుతూనే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com