ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులో స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో 5 ఏళ్ల బాలిక మృతి.. అసలేంటీ వ్యాధి?

national |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:20 PM

మన దేశంలో అత్యంత అరుదుగా వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు.. చాలా వరకు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో అరుదైన వ్యాధి కేరళలో ఓ 5 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా తాజాగా ఓ బాలిక చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదైన నైగ్లేరియా ఫౌలేరీ అమీబా వల్ల ఆ బాలిక మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ నైగ్లేరియా ఫౌలేరీ అమీబాను సాధారణంగా మెదడును తినే అమీబాగా కూడా పిలుస్తారు. ఇది ఒక అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్‌తో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో పోరాటం చేసిన బాలిక చివరకు ఓడిపోయింది.


కోజికోడ్‌లోని ఫద్వా అనే బాలికకు ఈ అరుదైన వ్యాధి సోకగా.. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తుది శ్వాస విడిచింది. చెరువులో స్నానానికి వెళ్లిన తర్వాత ఆమెకు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకింది. బాలిక అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మే 13 వ తేదీన ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో చికిత్స పొందుతున్న ఫద్వా.. వారం రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్‌కు వాడే మిల్టెఫోసిన్ అనే ఔషధం ఆమెకు అందించే సమయానికే ఫద్వా పరిస్థితి పూర్తి గా క్షీణించిందని డాక్టర్లు తెలిపారు.


మొదట మే 1 వ తేదీన ఆ బాలిక తన బంధువులతో కలిసి వారి ఇంటికి సమీపంలో ఉన్న మూన్నియూర్ సరస్సులో స్నానానికి దిగింది. ఆ తర్వాత మే 10 వ తేదీన మరోసారి స్నానం చేసింది. ఆ తర్వాత బాలికకు జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య ఏంటో గుర్తించకపోవడంతో మే 12 వ తేదీన చెలారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాక.. లక్షణాలు ఎక్కువ కావడంతో కోజికోడ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. చివరికి కొన్ని రోజులపాటు ఆమె చికిత్స తీసుకుంటూనే పరిస్థితి తీవ్రంగా విషమించి చనిపోయింది. అయితే బాలికతోపాటు మరో నలుగురు వ్యక్తులు కూడా చెరువులోకి దిగినా వారికి ఏమీ కాలేదని డాక్టర్లు తెలిపారు.


బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి?


ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాను..అమీబిక్ మెనింజైటిస్ లేదా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని కూడా పిలుస్తారు. ఈ మెదడు తినే అమీబా.. నైగ్లేరియా ఫౌలెరీ అమీబా వల్ల సోకే అరుదైన, ప్రాణాంతక వ్యాధి అని డాక్టర్లు తెలిపారు. కలుషితం అయిన నీటిలో ఉండే ఈ అమీబా.. మనిషి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడులో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మెదడును తినడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన రెండు వారాల తర్వాత వాసన కోల్పోవడం, తలనొప్పి, మెడ దృఢత్వం కోల్పోవడం, కాంతిని చూడలేకపోవడం, వికారం, వాంతులు, దిక్కుతోచని స్థితి, మగత, మూర్ఛలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకిన వ్యక్తికి వెంటనే సరైన చికిత్స అందించకపోతే చనిపోయే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా కేరళలో ఈ వ్యాధి సోకింది. 2017లో ఒకసారి.. 2023లో మరోసారి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు బయటపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com