ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరుడు గట్టిన హంతకుడు.. ఇంత సున్నిత మనస్కుడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 07:12 PM

మొద్దు శీను.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఇది పరిచయం అక్కర్లేని పేరు. 2005 జనవరి 24న టీడీపీ సీనియర్ నేత పరిటాల రవిని దారుణంగా హతమార్చింది తానేనని ప్రకటించుకున్న షార్ప్ షూటర్ ఇతడు. నా బావ సూరి కళ్లలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని తాను హత్య చేశానని బాహాటంగా మీడియాతోనే చెప్పి సంచలనం సృష్టించాడు. ఈ కేసులో లొంగిపోవడానికి ముందే ఓ మీడియా ఛానెల్ ప్రతినిధితో మొద్దు శీను మాట్లాడిన తీరు చూసిన వాళ్లు అతడిలో ఏ మాత్రం బెరుకు, భయం, పశ్చాత్తాపం లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.


మొద్దు శీను అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డిని 2008 నవంబర్ 9న మల్లెల ఓం ప్రకాశ్ అనే ఖైదీ జైల్లో నిద్రిస్తుండగా.. డంబెల్‌తో తలపై బాది హత్య చేశాడు. విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. ఓం ప్రకాశ్ సైతం 2020లో అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఈ ప్రపంచానికి మొద్దు శీను కరుడుగట్టిన నేరస్థుడిగా మాత్రమే తెలుసు. కానీ అతడిలో మరో కోణం కూడా ఉంది. ఓ మహిళకు ఉండేంత సున్నితమైన మనస్సు అతడికి ఉంది. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ప్రముఖ సినీ నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరావుకు మొద్దు రాసిన లేఖ ద్వారా ఈ విషయం తెలిసింది.


‘త్రిశూలం సినిమాలో మీరు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి మీ బుర్ర బద్దలుకొట్టాలనిపించింది. మీరు ఎక్కడ దొరుకుతారా అని చాలా రోజులు ఎదురు చూశాను. అది సినిమా అని తెలిసినా.. మీరు చేసిన పని నాకు నచ్చలేదు. కానీ మొన్న మీ ఎర్ర సీత నవల చదివాను. దాంట్లో ఎర్ర సీతను ఏడిపించిన తీరు.. మీ సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించారని ఖైదీ రాశాడు. ఆడ పిల్ల రాసినట్టుగా ఆ ఉత్తరం ఉంటుంది. నాకు కూడా చిన్నతనం నుంచి ఎదుటి వాళ్లు బాధపడితే సాంత్వన కలిగించాలని ఉంటుంది. నా హృదయాన్ని కరిగించారు. నక్సలైట్లు ఎందుకండీ ప్రపంచాన్ని మార్చడానికి.. మీ పుస్తకాలు చదివితే చాలు. మీ పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్‌తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ నాలుగు పేజీలు రాశాడు. మీరెప్పుడైనా కనిపిస్తే కన్నీళ్లతో మీ పాదాలను కడగాలని ఉంది. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటోన్న మీ శిష్యుడు మొద్దు శీను’ అని చర్లపల్లి జైల్లో ఉండగా.. గొల్లపూడి మారుతీరావుకు మొద్దు శీను లేఖ రాశాడని ప్రముఖ ఎన్నారై కిరణ్ ప్రభ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.


మొద్దు శీను రాసిన లేఖ పట్ల అప్పట్లో గొల్లపూడి మారుతీరావు సైతం స్పందించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మొద్దు శీను నా శిష్యులని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గురువుగా భావిస్తున్నానంటూ మొద్దు శీను రాసిన వ్యాఖ్యలను తన మనస్సును హత్తుకున్నాయని గొల్లపూడి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పెరిగిన వాతావరణం, తనకు ఎదురైన పరిస్థితుల వల్ల మొద్దు శీను ఓ హంతకుడిలా చరిత్రలో మిగిలిపోయాడు. కానీ అతడు కూడా ఓ మంచి మనసున్న మనిషేనని, సున్నిత మనస్కుడేనని గొల్లపూడికి రాసిన లేఖను బట్టి అర్థమవుతోంది. ఒక మనిషిలో ఇంత విరుద్ధమైన కోణాలు ఉండటం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే కదూ..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com