ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటివరకూ ఇండిపెండెంట్.. సడన్‌గా ఆ పార్టీ తరుఫున నామినేషన్.. ఇదెక్కడి ట్విస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:31 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కూడా పూర్తికావటంతో అభ్యర్థులు అందరూ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. ఇక ఏపీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గాలలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి స్థానం ఒకటి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి గట్టిపట్టున్న ఈ నియోజకవర్గం నుంచి చాలా చర్చలు, పరిణామాల తర్వాత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థిగా ఖరారయ్యారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తొలుత టికెట్ దక్కించుకున్నప్పటికీ.. రాజుగారి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే మంతెన రామరాజుకు టికెట్ కేటాయించటంతో టీడీపీలోని మరో నేత శివరామరాజు అసంతృప్తికి గురయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటానంటూనే అన్నంత పనీ చేశారు.


తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. మరో పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన శివరామరాజు.. ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా ఉన్న రఘురామకృష్ణరాజు.. శివరామరాజును బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శివరామరాజును కలిసి మద్దతు ఇవ్వాలని, సహకరించాలని కోరారు. అయితే ఎన్నికల్లో పోటీపై వెనక్కి తగ్గడం లేదు శివరామరాజు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన ఆయన.. ఎన్నికల బరిలో నిలిచారు.


వేటుకూరి వెంకట శివరామరాజు విషయానికి వస్తే 2009. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఉండి నుంచి మంతెన రామరాజు పోటీ చేయగా.. శివరామరాజు నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణరాజు.. శివరామరాజుపై విజయం సాధించారు. అయితే లోక్ సభకు వద్దని .. మరోసారి అసెంబ్లీకి పోటీచేస్తానంటూ ఎన్నికల ముందు టీడీపీ అధిష్టానానికి శివరామరాజు తెలియజేశారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం తొలుత మంతెన రామరాజు వైపు, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు వైపు మొగ్గు చూపింది. దీంతో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి శివరామరాజు ఎన్నికల బరిలో నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com