అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జరిగిన మహాకూటమి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార, తర్క శాస్త్ర పండితుడు జగన్నాథ పండిత రాయలు పుట్టిన నేల అని అభివర్ణించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూటమి తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన రైతు జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా చెబుతున్నా... బీసీలకు ఎన్డీయే కూటమి మాత్రమే న్యాయం చేయగలదని స్పష్టం చేశారు. కోనసీమను జగన్ వచ్చి కలహాల సీమగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ ప్రయత్నాన్ని మేం అడ్డుకున్నాం. రెండున్నర లక్షల హెక్టార్లలో కొబ్బరితోటలతో నిండిన ఈ అందాలసీమను తిరిగి ప్రేమ సీమగా మార్చుకునేందుకు శాయశక్తులా కృషి చేశాం.
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని తెలిపారు. ఇవాళ మేమందరం కలిసి వచ్చాం. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు... ఒక దేశానికి ఒక నది సరిపోదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు త్రివేణి సంగమం లాగా ఏర్పడ్డాయి. మీ అందరి భవిష్యత్తు కోసమే కూటమిగా మారాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. .