ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 07:54 PM

కృష్ణా జిల్లాలో ఘరానా దొంగ ఆటకట్టించారు పోలీసులు. జల్సాలకు అలవాటుపడి బైక్‌లకు చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలోని రామ్‌నగర్‌కు చెందిన ఒడుగు సుబ్బారావు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు సాయిబాబాగుడి దగ్గర నివాసం ఉంటూ తాపీ పని చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా రద్దీగా ఉండే వాహనాలు నిలిపే ప్రాంతాలను ఎంపిక చేసుకొని బైక్‌లను దొంగిలించేవాడు. ఈ వాహనాలను తెలిసినవారి ద్వారా తక్కువ ధరకే విక్రయిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు.


తోట్లవల్లూరు వద్ద కృష్ణా కరకట్టపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి సుబ్బారావు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే.. మొత్తం బండారం బయటపడింది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 18 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 37 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించాడు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ‌దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ బైక్‌ల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిపై 31 కేసులు నమోదు చేశామని.. మిగతా వాహనాలకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి ఉయ్యూరులోని పదో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com