తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన- టీడీపీ - బీజేపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ‘‘నేను నాన్ లోకల్ కాదు..లోకలే. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్ళు ఉంది. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను. కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను వైసీపీకి కోవర్టును కాదు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. ఐదేళ్ళ వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు. వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసు. తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తా. జనసేన- టీడీపీ - బీజేపీ నేతలందరూ నా వెంటే ఉన్నారు’’ అని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.