ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. బ్యాలెన్స్ తప్పిన హెలికాప్టర్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 09:50 PM

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో నేతలు, పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జాతీయ స్థాయి నేతలు విమానాలు, హెలికాప్టర్లలో రాష్ట్రాలను చుట్టివస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఒక్కసారిగా టెక్నికల్ సమస్య చోటు చేసుకుంది. ఎన్నికల సభలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా అదుపుతప్పింది. గాల్లోకి కొద్దిగా ఎగిరిన హెలికాప్టర్.. బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కొద్దిసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. అనంతరం చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. హెలికాప్టర్‌ను సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేంద్రమంత్రి అమిత్ షా.. బిహార్‌లో పర్యటించారు. బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. సభ పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్‌లో చిన్న సాంకేతిక లోపం ఏర్పడింది. అమిత్ షా ఎక్కిన తర్వాత హెలికాప్టర్‌ టేకాఫ్ అవుతుండగా.. బ్యాలెన్స్‌ తప్పింది. దీంతో ఆ హెలికాప్టర్ కొన్ని క్షణాల పాటు గాల్లో అక్కడే చక్కర్లు కొట్టింది. చివరికి ఆ పైలట్.. హెలికాప్టర్‌ను సురక్షితంగా టేకాఫ్‌ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అమిత్‌ షాకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌కు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే హెలికాప్టర్ ఎందుకు అలా జరిగింది అనేదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అమిత్‌ షా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్‌లో హెలికాప్టర్‌ ఇలా జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.


 ఇక ఈ ప్రమాదం జరగడానికి ముందు బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. కాశ్మీర్‌ అంశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 70 ఏళ్లుగా ఆర్టికల్‌ 370 ని వారి అక్రమ సంతానంగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఆర్టికల్‌ 370 ని రద్దు చేశామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com