ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపై పండ్లు అమ్ముకునే మహిళను కలిసిన నరేంద్ర మోదీ.. ఎవరీ మోహిని గౌడ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 09:55 PM

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎన్డీఏ కూటమికి మరోసారి అధికారం దక్కించాలనే ఉద్దేశంతో ప్రచార బాధ్యతలను మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తనపై వేసుకున్నారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటకలో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళను కలిశారు. హెలికాప్టర్ దిగగానే.. ఆ మహిళతో ముచ్చటించారు. వీధి వ్యాపారి అయిన మోహిని గౌడను ప్రధాని నరేంద్రర మోదీ కలవడంతో ఆమె ఎవరు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు తెరలేపింది. బస్టాండ్‌లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం సాగించే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలవడం ఎన్నికల వేళ వైరల్ అవుతోంది.


కర్ణాటకలోని సిరసిలో నిర్వహించిన ఎన్నికల సభకు వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ స్థానికంగా పండ్లు విక్రయించుకునే మోహిని గౌడ అనే మహిళతో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ కోసం మోహిని గౌడ చేస్తున్న కృషిని నరేంద్ర మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని హాలక్కి ప్రాంతానికి చెందిన మోహిని గౌడ.. అంకోలా బస్టాండ్‌లో బుట్టలో పండ్లు విక్రయించుకుంటూ జీవిస్తోంది. అయితే అందరిలాగా కవర్లలో పండ్లు అమ్మకుండా.. కేవలం ఆకుల్లోనే ఆమె పండ్లను విక్రయిస్తోంది. ఇక చాలా మంది ప్రయాణికులు.. పండ్లు కొని తిన్న తర్వాత ఆ ఆకులను ఎక్కడపడితే అక్కడ పడేసి వెళ్తుండడాన్ని మోహిని గౌడ గుర్తించింది. దీంతో వారికి చెప్పినా వినరని భావించిన ఆమె.. స్వయంగా ఆ ఆకులను ఏరి చెత్త బుట్టలో వేయడం ప్రారంభించింది.


అయితే కొన్ని రోజుల క్రితం ఆదర్శ్‌ హెగ్డే అనే వ్యక్తి.. మోహిని గౌడ చేసే పనిని గమనించాడు. అనంతరం ఆమె చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. బిజినెస్‌మెన్ ఆనంద్‌ మహీంద్రా కూడా ఆ వీడియోను రీపోస్ట్‌ చేస్తూ మోహిని గౌడపై ప్రశంసలు కురిపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న సైలెంట్ హీరోలు వీరే అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు.


ఎవరూ చెప్పకపోయినా.. అలాంటి పని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా మోహిని గౌడ చేస్తున్న పని.. నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో నెటిజన్లు మోహిని గౌడ చేస్తున్న కృషిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ విషయం కాస్తా ప్రధాని మోదీకి కూడా చేరింది. దీంతో ఇటీవల మోహిని గౌడ గురించి తెలుసుకున్న నరేంద్ర మోదీ సిరిసి పర్యటన భాగంగా ఆమెను హెలిప్యాడ్‌ వద్ద కలిశారు. స్వచ్ఛ భారత్‌ కోసం ఆమె చేస్తున్న కృషి ప్రస్తుత తరానికి ఎంతో స్ఫూర్తి దాయకమని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com