ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ శకలాలు.. 1971 యుద్ధంలో దొంగచాటుగా ప్రవేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 06:53 PM

విశాఖ తీరంలో పాకిస్థాన్ సబ్‌మెరైన్‌కు చెందిన శకలాలు బయటపడ్డాయి. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఇండియన్ నేవీ.. ఆ పాక్ జలాంతర్గామి శకలాలను గుర్తించింది. అయితే భారత్-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక పీఎన్ఎస్ గాజీ దొంగతనంగా ప్రవేశించిందని.. అయితే ఆ యుద్ధంలో భారత నౌకాదళం చేసిన దాడిలో అది మునిగిపోయిందని అధికారులు తేల్చారు. కానీ అంతర్గత పేలుడు కారణంగానే పీఎన్ఎస్ గాజీ పేలిపోయిందని పాక్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత భారత్ అత్యాధునిక టెక్నాలజీని వాడి పీఎన్ఎస్ గాజీ శకలాలను పసిగట్టింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్‌ రెస్క్యూ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.


ఇటీవలె భారత అమ్ములపొదిలోకి చేరిన 'ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌ (డీఎస్‌ఆర్‌వీ)' సాయంతో పీఎన్ఎస్ గాజీ శకలాలను కనుగొన్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు. విశాఖ తీరానికి కొన్ని నాటికల్‌ మైళ్ల దూరంలోనే సముద్రం అడుగు భాగంలో పీఎన్ఎస్ గాజీ శకలాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయితే యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం ఇండియన్ నేవీ ఆచారమని.. అందుకే ఆ శకలాలను ముట్టుకోలేదని పేర్కొన్నారు. విశాఖ తీరం నుంచి 2-2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున పీఎన్ఎస్ గాజీ శకలాలు ఉన్నట్లు తెలుస్తోంది.


డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ అయిన పీఎన్‌ఎస్‌ గాజీ అమెరికా నౌకాదళానికి చెందింది. దీన్ని 1963లో పాక్‌కు అమెరికా లీజుకు ఇవ్వగా.. పాక్‌కు ఇదే తొలి అటాక్‌ సబ్‌మెరైన్‌. 1971లో భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం చోటు చేసుకున్న వేళ.. నవంబర్‌ 14 వ తేదీన కరాచీ పోర్టు నుంచి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీలంక మీదుగా బంగాళాఖాతంలో విశాఖ తీరానికి చేరినట్లు ఇండియన్ నేవీ అంచనా వేస్తోంది. అయితే అప్పుడు భారత్‌ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలన్నదే పీఎన్ఎస్ గాజీ ప్రధాన లక్ష్యమని ఇండియన్ నేవీ పేర్కొంది.


ఈ దాడిని ముందే పసిగట్టిన అధికారులు.. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను అండమాన్‌ దీవులకు తరలించారు. ఆ స్థానంలో విశాఖ తీరం నుంచి ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ను రంగంలోకి దించారు. డిసెంబర్‌ 3 అర్ధరాత్రి సముద్రంలో.. పీఎన్ఎస్ గాజీ లక్ష్యంగా రెండు ఛార్జెస్‌ను వదిలింది. దీంతో భారీ పేలుడు జరిగి పీఎన్ఎస్ గాజీ మునిగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 92 మంది పాక్‌ సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే పేలుడు జరిగిన సమయం.. దాని శకలాల నుంచి సేకరించిన గడియారం ఆగిపోయిన వేళ ఒకటే కావడం గమనార్హం. పీఎన్ఎస్ గాజీ మునిగిపోవడం పాక్ నేవీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే పీఎన్ఎస్ గాజీ అంతర్గత పేలుడు వల్లే మునిగిపోయిందని పాక్‌ చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com