ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూటీపై రూ.3.20 లక్షల ఫైన్.. వాహనం తీసుకోమన్న ఓనర్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 10:56 PM

రోడ్లపై వెళ్లేటపుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఫైన్లు విధిస్తూ ఉంటారు. అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు పెండింగ్ చలాన్లను చెల్లిస్తే.. మరికొందరు మాత్రం వాటిని కట్టకుండా పేరుకుపోయేలా చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన స్కూటీపై 320 చలాన్లు పడేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ స్కూటీపై వందలాది చలాన్లు పడటంతో ఇప్పుడు ఆ విషయం తెగ వైరల్‌గా మారింది. చలాన్లు కట్టమని పోలీసులు వెళ్తే.. బండి తీసుకెళ్లండని ఆ యజమాని చెప్పడం గమనార్హం. అయితే బండి విలువ కంటే చలాన్ల మొత్తం ఎక్కువగా ఉండటంతో పోలీసులు అతడికి ట్విస్ట్ ఇచ్చారు. బండి అవసరం లేదు కానీ.. మొత్తం డబ్బులే కట్టాలని సూచించారు.


బెంగళూరులోని సుధామనగరకు చెందిన వెంకటరామన్‌కు చెందిన బండిపై ఇన్ని చలాన్లు ఉన్నాయి. కేఏ 05 కేఎఫ్‌ 7969 నంబరు కలిగిన హోండ్ యాక్టివా స్కూటీపై 320 చలాన్లు పడ్డాయి. ఈ మొత్తం చలాన్లకు జరిమానాగా వెంకటరామన్ స్కూటీపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.3.20 లక్షల ఫైన్లు విధించారు. అది చూసి వెంకటరామన్ షాక్ అయ్యాడు. హెల్మెట్‌ లేకుండా బండి నడపడం, సిగ్నల్‌‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లడం, రాంగ్ రూట్‌లో బండిని నడపడం, వన్‌వేలో ప్రయాణించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు వందల సార్లు చిక్కడంతో ఇలా భారీగా చలాన్లు వడ్డించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డవే ఇన్ని ఉంటే.. వారికి తెలియకుండా ఇంకా ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


వెంకటరామన్‌ బండిపై భారీగా చలాన్లు పడటంతో ఆయనకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో రూ.3.20 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వెంకటరామన్ అవాక్కయ్యాడు. అంత మొత్తం జరిమానా చెల్లించడం సాధ్యం కాదని.. కావాలంటే తన స్కూటీని తీసుకువెళ్లాలని ఆయన పోలీసులకు సూచించాడు. అయితే అందుకు పోలీసులు నిరాకరించడంతో.. తమకు వాహనం వద్దని.. జరిమానానే చెల్లించాలని పట్టుబట్టారు. రూ.3.20 లక్షల జరిమానా చెల్లించాలని.. లేకపోతే కేసు నమోదు చేస్తామని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనే ఆర్‌టీనగర ప్రాంతంలోని గంగానగరలో వెలుగు చూసింది. ట్రాఫిక్ రూల్స్ అత్రికమించినందుకు స్కూటీపై గతేడాది డిసెంబరులో రూ.3.22లక్షల జరిమానాను పోలీసులు విధించారు. ఆ వాహనంపై 643 చాలన్లు అతిక్రమించినట్లు పోలీసులు తెలిపారు. సదరు స్కూటీ యజమాని ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com