ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాలలో టీడీపీ ఇంఛార్జ్ మార్పు,,,మాజీ మంత్రి ఫరూక్‌కు బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 09:10 PM

భూమా ఫ్యామిలీకి టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న నంద్యాలలో ఈసారి అభ్యర్థిని మార్చేసింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నియమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకుముందు ఈ పదవిలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.


ఇటీవల చంద్రబాబు ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డిలను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్‌కు టికెట్‌ ఇస్తున్నామని.. సహకరించాలని భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు చెప్పారు. అయితే భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఫరూక్ గెలుపు కోసం పనిచేయాలని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు అధికారికంగా ఫరూక్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. అయితే బ్రహ్మానందరెడ్డి రెండు రోజులుగా అనుచరులు, పార్టీ నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి తాజాగా అధికారిక ప్రకటన రావడంతో.. భూమా అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీలో కొనసాగుతారా.. పార్టీ మార్చేస్తారా అన్న చర్చ నంద్యాలలో మొదలైంది. అంతేకాదు భూమా కుటుంబం నుంచి నంద్యాల చేజారిపోయినట్లైంది.


నంద్యాల టీడీపీలో చాలా రోజులుగా గ్రూప్ వార్ నడుస్తోంది. భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్‌లో పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. వీరికి తోడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా నంద్యాలలో పర్యటిస్తున్నారు. తాను కూడా నంద్యాల బరిలో ఉన్నానని సంకేతాలు పంపారు. ముగ్గురు ఈ టికెట్ కోసం పోటీపడ్డారు.. అయితే టీడీపీ మాత్రం మాజీ మంత్రి ఫరూక్ వైపు మొగ్గు చూపింది. మరి అధిష్టానం నిర్ణయంపై భూమా వర్గం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.


మొదటి నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు భూమా ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నాయి. భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి.. శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు భూమా దంపతులు 2014 ఎన్నికలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి కన్నుమూశారు. ఆమె స్థానంలో అఖిలప్రియను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయగా.. నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అయితే కొంతకాలానికి నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూయగా.. నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డిని పోటీ చేయించగా.. ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com